అమరావతి, మే 11: దేశ సరిహద్దుల్లో వీర మరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లాలోని కళ్లితండాలో ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వీర జవాన్ మురళీ నాయక్కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
అమర వీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.